హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బైల్ కమ్మర సామాజిక వర్గానికి చెందిన రాజ్యలక్ష్మి దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ పొందిన తొలి సంచార జాతి మహిళగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశంసించారు. మంగళవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో తనను కలిసిన రాజ్యలక్ష్మిని మంగళవారం ఆయన అభినందించారు. సాఫ్ట్స్కిల్స్లో ఆమె పీహెచ్డీ పూర్తి చేయడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బైల్కమ్మరులను బీసీ జాబితాలో చేర్చడంతో ఉద్యోగావకాశం పొందే అర్హత సైతం రాజ్యలక్ష్మి సాధించిందని గౌరీశంకర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టానికి ముందు ఎవరూ బైల్కమ్మరలను గర్తించలేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో వారిని బీసీ జాబితాలో చేర్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బైల్కమ్మరుల సంఘం ప్రధాన కార్యదర్శి కే మోహన్ చౌహాన్, తుల్జారాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
2024-09-08 06:01:41